Tuesday, January 17, 2012

కోడి పందాల రక్తపు సొమ్ము


‘ప్రాణాలు తీయాలి..మూగజీవాలను దగ్గరుండి మరీ చంపించాలి.. అవసరమైతే కత్తులు కట్టాలి..డబ్బు మూట కట్టాలి’ ఇది కోడిపందెం దారుల సూక్తి. ప్రకాశం జిల్లా ఎడ్ల బండలాగుడు పోటీల్లో ఇద్దరి ప్రాణాలు పోయినా,చిత్తూరు జిల్లా రంగంపేట జల్లికట్టులో ఇరవై మంది గాయపడ్డా, ఎద్దుకు తీవ్రగాయాలు,గోదావరి జిల్లాల్లో కోళ్లను పణంగా పెట్టడం.. ఇవన్నీ సంక్రాంతి చేదు జ్ఞాపకాలే. పాపం..వాళ్లను ఎందుకు లెండి విమర్శించడం !. సంక్రాంతి పండుగకని.. సరదాగా మూడురోజుల పాటు రాష్ట్రంలో కోడిపందాలు నిర్వహించుకున్నారు. ముఖ్యంగా తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పందాలు నభూతో నభవిష్యత్తు అన్న తీరుగా జరిగాయి. డబ్బులు,మద్యం ఏరులై పారాయి. డబ్బు విషయం కదా !

ప్రజాప్రతినిధులందరూ కూడా ఒకతాటిపై కొచ్చారు. అంత తక్కువ వ్యవధిలో ఎక్కువ డబ్బులు ఏమి చేస్తే సంపాదించొచ్చు చెప్పండి? ముపె్ఫై వేల పుంజులు చస్తే చచ్చాయి..కష్టపడి కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. సామాన్యుడి ఆడితే అది జూదం. కానీ ధనికులు, ప్రజాప్రతినిధులు, కొద్దోగొప్పో పేరున్నవాళ్లు ఆడితే యోగం అని సరిపెట్టుకోవాలి. కోళ్లను పావులుగా చేసి సంపాదించిన వీరందరూ కోడీశ్వరులే. ఓ కంట కనిపెట్టాల్సిన పోలీసులు మనకెందుకులే అనుకున్నారు. అరకొర కేసులు నమోదు చేశారు. పందెం ప్రాణాలు పోయాయి.. పందెం దారులు మాత్రం రక్తపు సొమ్ము మూటగటుకున్నారు.

ఏలూరు/రాజమండ్రి, మేజర్‌న్యూస్‌ ప్రతినిధి : పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రతి మం డల కేంద్రంలో కోడిపందేలు జోరుగా సాగాయి. పండుగ మూడు రోజుల్లో 30 వేల పుంజులు రక్తం చిందించి నేల కూలాయి. ఈ పం దేలకు జిల్లా వ్యాప్తంగా ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఏడాది ఐ భీమ వరంలో పందాల జోరు తగ్గింది. బడా బాబులు మాత్రం జిల్లాలోని గణపవరం, పోడూరు, నిడద వోలు ప్రాంతాల వైపు ఈ సారి మొగ్గు చూపారు. ఆదివారం నిడదవోలు బరిలో సినీహీరో రవితేజ సం దడి చేశారు. అదేవిధంగా పోడూరులో మాజీ ఎమ్మెల్యే చిట్టబ్బాయి, తాడేపల్లిగూడెంలో మాజీ ఎమ్మెల్యే ఆధ్యర్యంలో సాగగా, ఐ భీమ వరంలో అబ్బాయిరాజు, గణపవరంలో మాజీ సర్పంచి కలిదిండి సోమ రాజు ఆధ్వర్యంలో పందాలు నిర్వహించారు.

జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో పందాలు నిర్వహించి పోలీసులను ముప్పు తిప్పలు పెట్టారు. పెదవేగి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు జిల్లాలోని ప్రధానంగా ఎమ్మెల్యేలుగా పందాలు ఆడారు. అదే విధంగా గణపవరంలో నిర్వహించిన పందాల బరిలో మాజీ ఎమ్మెల్యే చెరుకవాడ రంగనాథరాజు, మాజీ మంత్రి, తెలుగుదేశం రాష్ట్ర నాయకులు మాగంటి బాబు పాల్గొని సందడి చేశారు. గత సంవత్సరం ఐ భీమవరంలో 40 లక్ష లకు పందెం సాగగా ఈ సంవత్సరం పోడూరులో 14 లక్షలకు పైబడిన పందేన్ని నిర్వహించారు. ఇదే ఈ ఏడాది భారీ స్థాయి పందెం అని పందెం రాయుళ్లు చర్చించుకుంటున్నారు.

జేబులు ఖాళీ
జిల్లా వ్యాప్తంగా ఈ మూడు రోజుల పాటు నిర్వహించిన జూద క్రీడలయిన పందాలు, పేకాట, గుండాట వంటి వాటిలో కొందరు జేబులు గుల్ల చేసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ పం దేలలో రూ.80 కోట్లు చేతులు మారాయి అంటే ఈ జూదం ఏమేర సాగిందో అర్ధం చేసుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు అరకొర కేసులను నమోదు చేశారు. ఈ మూడు రోజుల పాటు వివిధ జూదాలపై దాడులు చేసి జిల్లా వ్యాప్తంగా 681 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి రెండు లక్షల 36 వేల 894 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్‌పి రవివర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంకా ఎవరైనా పందాలు, పేకాట వంటి జూదక్రీడలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

పంతం నెగ్గింది..పందెం ముగిసింది
తూర్పు గోదావరి జిల్లాలో దాదాపు రూ.100కోట్ల మేర జూదం జరిగినట్టు అంచనా. మద్యం కూడా ఏరులై పారింది. పండుగ మూడు రోజులపాటు సగటున రూ.10 కోట్ల విలువ చేసే మద్యం విక్రయాలు జరిగినట్టుగా తెలుస్తోంది. అలాగే నాటుసారా విక్రయాలు కూడా కోట్ల రూపాయల మొత్తంలోనే జరిగి నట్టు సమాచారం. కోడిపందాలను అరికట్టాల్సిన పోలీసులకు కూడా భారీ మొత్తంలోనే మామూళ్ళు అందినట్టు తెలుస్తోంది. ఈ మూడు రోజులపాటు జరిగిన జూదంలో మద్య, పేదవర్గానికి చెందిన పం దెం రాయుళ్ళు భారీగా నష్టపోయారు.

punjus 

జిల్లాలో అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు జరిగినా, పోలీసులు మాత్రం దాడులు జరిపి పందాలను నిలువరించిన సంఘటనలు లేకపోవటం గమనార్హం. ఏజెన్సీ నుంచి, మైదాన ప్రాంతంలోని అన్ని మండలాల్లోను మూడు రోజులు యథేచ్చగా కో ిపందాలు, పేకాట, గుండాటలు జరిగాయి. కోనసీమలో పలువురు ప్రజాప్రతినిధులు దగ్గరుండి మరీ పందాలను జరిపించారు. ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరం, ఏజెన్సీకి ముఖద్వారమైన గోకవరం, ఏలేశ్వరం, అడ్డతీగల తదితర చోట్ల కోడిపందాలు జోరుగా సాగాయి. మారేడుమిల్లి, వై.రామవరం, గంగవరం, రాజవొమ్మంగి మండలాల్లోని పలుప్రాంతాల్లో కోడిపందాలు యథేచ్చగా జరిగాయి. రాజ మండ్రి నగ రాన్ని ఆనుకుని వున్న కోలమూరు, కోరుకొండలో గ్రామకమిటీల ఆధ్వర్యంలో కోడ ిపందాలు, పేకాట, గుండాటలు భారీగా జరిగాయి.

సముద్రతీరప్రాంతమైన కొత్తపల్లి, తాళ్ళరేవు, కాజు లూరు, తొండంగి, అంతర్వేది, అల్లవరం తదితర ప్రాంతాల్లో ఈ పందాలు బహిరంగంగానే జరిగాయి. ప్రజాప్రతినిధుల వత్తిళ్ళ మేరకు పోలీసులు సంక్రాంతి మూడు రోజులపాటు పందాల జోలికి వెళ్ళకపోవడంతో ఎక్కడిక్కడ కోడిపందాలు బరులు ఏర్పాటు చేసుకుని బహిరంగంగానే జూదాలు నిర్వహించారు. ఈ జూదాల్లో ఒక్కొక్క తోటలో కనీసం వెయ్యిమందికి తక్కువ కాకుండా జూదగాళ్ళు, ప్రేక్షకులు పాలొ ్గన్నారు. జిల్లాకు చెందిన చాలామంది జూదగాళ్ళు పొరుగు జిల్లా పశ్చిమగోదావరి జిల్లాకు భారీ సం ఖ్యలో తరలివెళ్ళారు.

ఈ జూదాల్లో ఈ మూడు రోజులపాటు దాదాపు రూ.100 కోట్లు చేతులు మారి నట్లు సమాచారం. సంక్రాంతి పండుగ రోజుల్లో దాదాపు రూ.30 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగి నట్టు తెలుస్తోంది. ఈ కోడిపందాల విషయంలో చూచిచూడనట్టు వ్యవహరించాలంటూ పోలీస్‌శాఖ ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు అందినట్లు సమాచారం.ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న కొంతమంది పోలీసులు భారీగా మామూళ్ళు దండుకున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. పలు లాడ్జిలు, హోటళ్ళకు అనధికార అనుమతులు ఇచ్చి పేకాటరాయుళ్ళను ప్రోత్సహించారు. ఈ వ్యవ హారంలో పోలీసులకు భారీగా ముడుపులు ముట్టినట్టు సమాచారం.

Monday, January 16, 2012

జూదాల జోరు.. పందాల హోరు * కోట్లు హుష్‌కాకి!

 
*  కోడి పందాలు.. పక్కనే జూద శిబిరాలు
*  పందాల్లో చేతులు మారింది రూ.150 కోట్లు!
*  జూదంలో మరో రూ.100 కోట్లు హాంఫట్!
*  డెల్టాను తలదన్నుతూ మెట్టలోనూ పందాలు
*  ఏరులై పారిన మద్యం.. పలుచోట్ల ఘర్షణలు
*  పందాలరాయుళ్ల ఇళ్లు.. ఒళ్లు గుల్ల!


సంప్రదాయం ముసుగులో జూదం వెర్రితలలేసింది. పండుగ మూడు రోజులూ పందాలరాయుళ్లు కోడి పందాలు, జూదాలతో ఊగిపోయూరు. కోడి పందాల్లోనే కాదు.. కోతాట, గుండాట, మూడు ముక్కలాట, గ్లాస్ బాల్ ఆట, స్ట్రయికర్ (బిళ్లాట), బ్రాకెట్ అంటూ రకరకాల పేర్లతో సాగిన జూదంలోనూ కోట్లాది రూపాయలు చేతులు మారాయి. 


‘రాజకీయ పెద్దలు.. బడాబాబులు’ సాగించిన జూదక్రీడలో పందెగాళ్లు రూ.150 కోట్లు ఫణంగా పెట్టగా, దానిలో దాదాపు పది కోట్లు నిర్వాహకుల జేబుల్లోకి చేరాయి. రాజధాని నుంచి ఆదేశాలు, జూదాల నిర్వాహకులతో కుదిరిన బేరాలతో మూడు రోజులు నిద్ర నటించిన పోలీస్ యంత్రాంగం ఇప్పుడు జూలు విదుల్చుతానంటోంది. మంగ ళవారం నుంచి కోడిపందాలు, పేకాట శిబిరాలపై ఝుళిపించేందుకు లాఠీలను సిద్ధం చేస్తోంది.

పందెం కోడి ప్రతాపం చూపింది. నిమిషాల వ్యవధిలో పందెగాళ్ల తలరాతల్ని మార్చేసింది. కార్లలో సంచులతో డబ్బు తెచ్చిన జూదరులకు ఖాళీ చేతులు మిగిల్చింది. లక్షలు ‘పెట్టుబడి’ పెట్టిన నిర్వాహకుల్ని కోటీశ్వరుల్ని చేసింది. ఈ ఏడాది సంక్రాంతి పందాల్లో విశేషమేమిటంటే.. పందాల నిర్వహణకు పేరుమోసిన డెల్టా ప్రాంతానికి దీటుగా మెట్ట ప్రాంతంలోనూ కోట్లాది రూపాయల్లో పందాలు సాగాయి. జిల్లా మొత్తం మీద ఏర్పాటైన దాదాపు 300 కోడి పందాల శిబిరాల్లో రూ.150 కోట్లు చేతులు మారగా, ఒక్క జంగారెడ్డిగూడెం ప్రాంతంలోనే రూ.50 కోట్ల సొమ్మును ఫణంగా పెట్టినట్లు అంచనా వేస్తున్నారు. ఈ శిబిరాలకు అనుబంధంగా నిర్వహించిన పేకాట కోసుల్లో మరో రూ.వంద కోట్లు వరకు చేతులు మారినట్లు అంచనా.

జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో వేసిన పందాల్లో పొరుగున ఉన్న ఖమ్మం, కృష్ణా జిల్లాల నుంచి వేలాది మంది జూదరులు పాల్గొన్నారు. కామవరపుకోట మం డలం కళ్లచెరువులో పందాలకు టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ సోదరుడు గోపాలరావు, చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ హాజరయ్యారు. గెలిచిన పుంజుల యజమానులకు ఎమ్మెల్యే రాజేష్ బహుమతులు అందజేశారు. పోడూరు, కొప్పాక, ఐ.భీమవరం, భీమవరం ప్రకృతి ఆశ్ర మం, వెంప, కలగంపాడు, కొణిజర్ల, ఆకివీడు, కాళ్లుకూరు, ఉండి, యండగండి, మహాదేవపట్నం, మోగల్లు, విస్సాకోడేరు, పెన్నాడ, చాగల్లు, చిక్కాల, నిడదవోలు, తాడేపల్లిగూడెం, సీతంపేట, గూటాల, దేవరపల్లి, చిన్నాయగూడెం, గౌరీపట్నం, అప్పనవీడు, కొమ్మర, అత్తిలి, వేల్పూరు, ఇరగవరం, రేలంగి, ఇల్లింద్రపర్రు, బుట్టాయగూడెం, వెంకటాపురం, రావికంపాడు, కొయ్యలగూడెం, బయ్యన్నగూడెం, రాజ వరం, సీతంపేట, దిప్పకాయలపాడు, తిరుమలదేవిపేట, టి.నర్సాపురం, రాచన్నగూడెం, టి.గంగన్నగూడెం, చంద్రమ్మకాలనీ, కొవూరుపాడు, గుడ్డిగూడెం, వెంకటాయపాలెం, పెదవేగి, కొండలరావుపాలెం, కవ్వగుంట తదితర ప్రాంతాల్లో జరిగిన భారీ పందాల్లో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. 


కొవ్వూరు మండలం వాడపల్లి, సీతంపేట, ఐ.పంగిడి గ్రామాల్లోని శిబిరాలు పందాలరాయుళ్లతో కిక్కిరిశాయి. కొప్పాక, పోడూరు ప్రాంతాల్లో ఒక్కో పందానికి రూ.లక్షకు పైగా ఉంటేనే బరిలో ఉండాలనే నిబంధన విధించారు. ఐ.భీమవరం, భీమవరం ప్రకృతి ఆశ్రమం, వెంప గ్రామాల్లో సాగిన పందాల్లో ఒక్కో పందానికి రూ.25 వేలకు తక్కువ కాకుండా ఉండాలని షరతు విధించారు. భారీ మొత్తాలతో కొందరు కోళ్లను బరిలో దించితే మరికొందరు వేలాది రూపాయలు పైపందాలు కాశారు.
రకరకాల జూదం


సంప్రదాయం పేరుతో కోడి పందాలకు లోపాయికారీ అనుమతి తీసుకున్న నిర్వాహకులు జూద శిబిరాలను ఏర్పాటుచేసి పందెగాళ్ల జేబుల్ని ఖాళీ చేశారు. మూడు ముక్కలాట, గుండాట, బ్రాకెట్, స్ట్రయికర్ (బిళ్లాట), కోతాట అన్ని శిబిరాల్లో యథేచ్ఛగా కొనసాగాయి. కోడి పందాల్లో కంటే వీటిలో పోగొట్టుకున్న సొమ్మే ఎక్కువ. జిల్లావ్యాప్తంగా అన్ని శిబిరాల్లోనూ మందు, విందుతో పసందైన ఏర్పాట్లు చేయడంతో జూదరులు పండగ పూట ఇంటి ముఖం చూడలేదు. పందాల పౌరుషానికి మద్యం మత్తు తోడవడంతో పలుచోట్ల ఘర్షణలు జరిగాయి. ఇరగవరం మండలం సూరంపూడిలో కోడిపందాల శిబిరం వద్ద ఆదివారం రాత్రి జరిగిన కోట్లాటలో ఏడుగురికి గాయాలయ్యాయి. మిగిలిన చోట్ల కూడా చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. కాగా, రాజకీయ నాయకుల ఒత్తిళ్లు, బడాబాబుల దబాయింపులతో పోలీసులు పందాలు, జూదాలవైపు చూసే సాహసం చేయలేదు. జనం పెద్ద ఎత్తున చట్టాన్ని ఉల్లంఘించడంతో వారిని కంట్రోల్ చేయలేక పోలీసులు గప్‌చిప్‌గా ఉండిపోయారు.

నిర్వాహకులకు ‘కేవుల్’ కాసులు
సంక్రాంతి పందాలు శిబిరాల నిర్వాహకులకు భారీ ఆదాయాన్ని ఆర్జించి పెట్టాయి. కోడి పందాల్లో లక్షకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు కేవులు తీస్తారు. దీన్ని నిర్వహణ ఖర్చులుగా చెబుతారు. గతంలో అనేక చోట్ల కేవుల్ సొమ్ములు నిర్వాహకుల మధ్య వివాదాలకు కారణమయ్యా యి. డెల్టాలోని కొన్నిచోట్ల నిర్వాహకుల తీరుపై గుర్రుగా ఉన్న కీలకమైన పందెగాళ్లు ఈసారి మెట్టప్రాంతంలోని కొప్పాక, శ్రీనివాసపురం, కొణిజర్లలాంటి చోట జరిగిన పెద్ద పందాలకు తరలివెళ్లిపోయారు. డెల్టాలో కన్నా మెట్ట ప్రాంతంలోనే భారీ మొత్తాలు చేతులు మారినట్లు చెబుతున్నారు.


కృష్ణా జిల్లాలో కోట్లు హరీ!
 
సంక్రాంతి పండగ మూడు రోజులూ.. పల్లెలన్నీ కోడి పందేలతో హోరెత్తాయి. జనం మద్యం మత్తులో తూగి ఊగారు. కూలీ నుంచి కోటీశ్వరుడు వరకూ కోడిపుంజుల పౌరుషాగ్నిలో చలికాచుకున్నారు. పై పందేలు వేసి అనేకమంది జేబులు ఖాళీ చేసుకున్నారు. ఈ మొత్తం రూ.50 కోట్లకు పైగానే ఉంటాయని లెక్కిస్తున్నారు. పశ్చిమ కృష్ణాతో పోల్చితే తూర్పులో ఈ జోరు ఎక్కువగా కనిపిం చింది. మంత్రులు, ఎమ్మెల్యేలు పందేలకు తమ పూర్తి మద్దతు ఇవ్వడం పలువుర్ని ఆశ్చర్యానికి గురిచేసింది.

 సంక్రాంతి సంబరాల్లో కోడి పందేల వెర్రి హోరెత్తింది. మూడురోజుల పాటు జిల్లా వ్యాప్తంగా అడ్డూ అదుపూ లేకుండా పందేలు, జూదం కొనసాగాయి. వీటిలో రూ.50 కోట్లకు పైనే చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు. తూర్పు కృష్ణా మొత్తం పందేల జోరులో ఊగిపోయింది. కూలీనాలీ చేసుకునే సామాన్యులు మొదలు ధనవంతులు, రాజకీయ నాయకులు వరకూ అంతా శని, ఆది, సోమవారాల్లో ‘బరి’ బాట పట్టారు. రూ. 5 వేల నుంచి రూ. లక్ష వరకూ పందేలు కాశారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో గతంలో ఆ ఊసే లేని గ్రామాలు కూడా పండగ రోజున రంగంలోకి దిగాయి.

మొవ్వ మండలం భట్లపెనుమర్రు, గూడూరు మండలం గూడూరు, మండవల్లి మండలం చింతపాడు, కైకలూరు మండలం భుజబలపట్నం, హనుమాన్‌జంక్షన్ సమీపంలోని తాళ్లమూడి (పశ్చిమగోదావరి పరిధి), చాట్రాయి మండలం జనార్దనవరం, ఘంటసాల మండలం పాపవినాశనం, మోపిదేవి మండలం బొబ్బర్లంక, పమిడిముక్కల మండలం మేడూరులో భారీ ఎత్తున పందేలు జరిగాయి. భట్లపెనుమర్రు, గూడూరు, తాళ్లమూడి, జనార్దనవరంలో జరిగిన పందేల్లోనే రూ. 15కోట్లు చేతులు మారినట్లు చెబుతున్నారు. తూర్పు కృష్ణాలోని గుడివాడ, గుడ్లవల్లేరు, పామర్రు, కలిదిండి, పెడన, అవనిగడ్డ ప్రాంతాల్లోని అనేక గ్రామాల్లో పందేలు జరిగాయి. తూర్పుకృష్ణా స్థాయిలో కాకపోయినా నూజివీడు డివి జన్‌లోనూ పందేలు బాగానే జరి గాయి. నందిగామ, జగ్గయ్యపేట ప్రాం తాలు ఇందుకు మినహాయింపుగా నిలిచాయి.

ట్రాక్టర్లు, ఆటోల్లో..
పందేల్లో పాల్గొనడానికి పెద్దపెద్ద బరుల వద్దకు గ్రామాల నుంచి జనం ఆటోలు, ట్రాక్టర్లు, కార్లలో వెళ్లారు. పందేలు జరిగే చోట మద్యం అమ్మకాలు కూడా యథేచ్ఛగా సాగాయి. కొన్ని చోట్ల కోసులు నిర్వహించారు. వివిధ పార్టీల నేతలు కూడా పందేల్లో పాల్గొనడం, స్థానిక ప్రజాప్రతినిధులు అండదండలందించడంతో అడ్డుకునేవారే లేకుండా పోయారు.

మిన్నకుండిపోయిన పోలీసులు
జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున పందేలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకున్న పాపానపోలేదు. పైస్థాయి నుంచే వారిపై ఒత్తిడి ఉండడం, ఎమ్మెల్యేలు ముందస్తుగానే వారికి హైదరాబాద్ నుంచి ఫోన్లు చేయించడంతో పోలీసు ఉన్నతాధికారులు కూడా నోరు మెదపలేదు. పోలీసులు పట్టించుకోవడంలేదనే సమాచారం జిల్లా అంతా గుప్పుమనడంతో పందేలు వేసే ఆలోచన లేని గ్రామాలు కూడా అప్పటికప్పుడు బరిలు ఏర్పాటు చేసి పందేలు వేయడం గమనార్హం.

కమిషనరేట్‌లోనూ..
జిల్లాలో విచ్చలవిడిగా కోడి పందేలు జరిగినా కమిషనరేట్ పరిధిలో మాత్రం చాలా వరకూ ఆ హడావుడిని తగ్గించగలిగారు. అయితే జిల్లా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని పమిడిముక్కల మం డలం మేడూరులో భారీ స్థాయిలోనే కోడిపందేలు జరిగాయి. కమిషనరేట్ పరిధిలో ఎక్కడా కోడి పందేలకు ససేమిరా అన్న పోలీసులు ఆయన ఒత్తిడితోనే మేడూరుకు మాత్రం అనధికారికంగా అనుమతిచ్చినట్లు తెలిసింది. మర్రివాడలోనూ పందేలు జరిగాయి. అక్కడకు వెళ్లిన పోలీసులను గ్రామస్తులు అడ్డుకున్నారు. వారి మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. గ్రామస్తులు వినే పరిస్థితి లేకపోవడంతో పోలీసులు వెనక్కి తిరిగి వచ్చేయక తప్పలేదు. కోడి పందేలను పూర్తిగా వదిలేసి అక్కడక్కడా దాడులు చేసి చేతులు దులుపు కున్నారు.

గోదావరి జిల్లాలలో కోడిపందేలతో సంక్రాంతి సంబరాల జోష్

Saturday, January 14, 2012

కోడి పందేల జాతర * తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాల్లో జోరు * కో..ఢీ! * జిల్లాల వ్యాప్తంగా నెత్తురోడిన కోళ్లు


* పదిచోట్ల భారీగా, మరో 300 చోట్ల చిన్నాపెద్దా శిబిరాలు,
* తొలిరోజునే చేతులు మారిన రూ. 50 కోట్లు
* జిల్లాకు తరలివచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు
* భారీగా పేకాట శిబిరాలు, ఏరులై పారిన మద్యం
* ప్రత్యేక ఆకర్షణగా ఫుడ్ ఫెస్టివళ్ళు
* స్థాయికి తగ్గట్లుగా ఖాకీలకు కాసుల పంట


ఖద్దరుకు ఖాకీకి జరిగిన పోటీలో పందెం కోడిదే పై ‘చెయ్యి’గా నిలిచింది. నిన్నటి వరకు పందాలు జరగనిచ్చేది లేదని భీష్మించిన పోలీ సులు, రాజకీయ ప్రముఖుల ఒత్తిళ్లకు తలవంచి తోక ముడిచారు. ఈ విష యం ముందే తెలిసి శిబిరాలను సిద్ధం చేసుకున్న పందాలరాయుళ్లు శనివా రం ఒక్కసారిగా బరిలో దూకారు. జిల్లా ప్రత్యేకతను చాటుతూ అట్టహాసంగా పందాల జాతర ప్రారం భించారు. ఒక చోట ఎమ్మెల్యే, మరో చోట టీవీ నటి ఈ శిబిరాలను ప్రారంభిస్తే, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన సినీ, రాజకీయ రంగ ప్రముఖులు, ఫ్యాక్షన్ లీడర్లు స్పెషల్ ఎఫెక్ట్‌నిచ్చారు. 

‘పశ్చిమ’లో చేతులు మారిన మొత్తం రూ. 50 కోట్లపైనే
తూర్పు పందెంలో ఎమ్మెల్యే రాపాక ‘పుంజు’

ఉభయగోదావరి జిల్లాలతోపాటు, కృష్ణాజిల్లాలో కోడిపందేలతో సంక్రాంతి సంబరాల జోష్ అందుకుంది. ప్రజాప్రతినిధుల అండతో విచ్చలవిడిగా జరుగుతున్న ఈ పోటీలను తిలకించేందుకు శనివారం సినీ, రాజ కీయప్రముఖులు పోటెత్తారు. కొన్నిప్రాంతాల్లో ఏకంగా ఎమ్మెల్యేలే పందేలను ప్రారంభించారు. ఈసారి పందేలు జరగనిచ్చేది లేదంటూ శుక్రవారం వరకు బీరాలు పలికిన పోలీ సులు ఇప్పుడు వాటిని కళ్లారాచూసి తరిస్తున్నారు. కొన్నిప్రాంతాల్లోని పందేలకు పోలీసులే రక్షణగా ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పశ్చిమగోదావరి జిల్లా పందేల బరిగా మారింది. ఫ్లడ్‌లైట్లు, జనరేటర్లు, భారీ టెంట్లతో జిల్లాలోని ప్రతిపల్లెలోనూ కోడిపందేలు, పేకాట శిబిరాలు కని పించాయి. మునుపెన్నడూలేని విధంగా పందేల జాతర మొదలైన తొలిరోజునే దాదాపు రూ. 50 కోట్లు చేతులు మారాయి. ఒకచోట క్రికెట్ పోటీలను తలపించే స్థాయిలో ఎల్‌సీడీ తెరల్ని ఏర్పాటు చేయగా, మరోచోట చాంపియన్‌గా నిలిచిన పందెంరాయుడికి నజరానాగా ఇచ్చేందుకు రూ.12 లక్షల విలువైన లగ్జరీ కారును సిద్ధం చేసి ఉంచారు.

బరులకు పోలీసుల రక్షణ


తొలుత కోడిపందేలు జరగనివ్వమని చివరికి తోక ముడిచిన పోలీసులు పనిలో పనిగా కాసుల వేటలో నిమగ్నమయ్యారు. నల్లజర్లలో వారే బినామీలతో శిబిరం నిర్వహించారు. మిగి లిన చోట్ల సివిల్‌డ్రస్సుల్లో వచ్చిన పోలీసులు శిబిరాల్లోనే నిర్వాహకులతో బేరాలు కుదుర్చుకుని సంతృప్తి చెందారు. ఒక్కోపోలీస్ స్టేషన్‌కు అక్కడ నిర్వహించే శిబిరం స్థాయిని బట్టి రూ. 20 వేల నుంచి రూ.3 లక్షల వరకు ముట్టజెప్పినట్లు సమాచారం. పెదవేగి మండలం కొప్పాకలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనిప్రభాకర్ స్వయంగా భారీ కోడిపందేల శిబిరాన్ని నిర్వహించారు.


నిడదవోలులో జరిగిన శిబిరంలో సినీ నటుడు బాబూమోహన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. తూర్పుగోదావరి, ఖమ్మం జిల్లాలకు చెందిన ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కర రామారావు, బాలసాని లక్ష్మీనారాయణ ఈ శిబి రంలో పందేలను తిలకించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయిభీమవరం, వెంప, భీమవరంలోని శిబిరాలను సందర్శించారు. వెంప శిబిరంలో సినీనటులు చిన్నా, ఆహుతి ప్రసాద్, సినీ నిర్మాతలు కేఎస్ రామారావు, సి.కల్యాణ్ సందడి చేశారు. బుట్టాయగూడెం మండలం దుద్దుకూరు శిబిరాన్ని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో టీవీనటి మంజుల రిబ్బన్ కట్ చేసి కోడిపందేలను ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లాలో తొలిరోజే రూ.5 కోట్లకు పైగా పందాలు జరిగినట్టు అంచనా వేస్తున్నారు. మలికిపురంలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పుంజు పాల్గొన్న పందెంతోనే బోణీ జరిగింది. మరో నాయకుడి పుంజుతో పావుగంటకు పైగా హోరాహోరీగా సాగిన ఈ పోరులో చివరకు ఎమ్మెల్యే రాపాక పుంజే గెలిచింది.

కృష్ణాజిల్లాలో అధికార పార్టీకి చెందిన పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ తన నియోజకవర్గంలోని గూడూరు, పెందుర్రు, అర్తమూరు, చెరుకుమిల్లిలో పందేలను స్వయంగా ప్రారంభిం చారు. 

టీడీపీకి చెందిన కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ మండవల్లి మండలం చింతపాడులో జరుగుతున్న పందేల బరుల వద్దకు కుటుంబంతో సహా వెళ్లి వీక్షించారు. పశ్చిమగోదావరి జిల్లాలో మాదిరిగా ఇక్కడా పందేలు నిర్వహిస్తామని శుక్రవారం ప్రకటించిన ఆయన అదేమాట ప్రకారం తన నియోజకవర్గంలో కోడి పందేలకు శ్రీకారం చుట్టారు.

ఉన్నతస్థాయిలో పందాలకు పచ్చజెండా ఊపడంతో కిందిస్థాయి పోలీస్ సిబ్బందికి కాసుల పంట పండింది. ఒక్కో స్టేషన్‌కు రూ. 20 వేల నుంచి 2 లక్షల వరకు వసూలు చేశారు. కొన్ని చోట్ల ఏకంగా పోలీసు సిబ్బందే బినామీ పేర్లతో పందేలు నిర్వహించారు. కమ్ముకున్న కరువు, ధరల దరువు, కుంటుపడిన వ్యవసాయం కారణంగా పండుగ పందాలపై జనం ఆసక్తి చూపించకపోవచ్చునన్న అంచనాలు తల్లకిందులయ్యాయి. జిల్లా ప్రజలు తొలి రోజునే పందాలు అయి భీమవరం, భీమవరం, వెంప, అంకన్నగూడెం, నిడదవోలు, శ్రీనివాసపురం, తాడేపల్లిగూడెం, కొణిజర్ల తదితర పది చోట్ల భారీగా ఏర్పాటు చేసిన శిబిరాల్లో రూ. 15 కోట్లు చేతులు మారాయి. మిగతా చోట మరో రూ.35 నుంచి 40 కోట్ల వరకు పందాలు జరిగినట్లు అంచనా.

ప్రముఖుల తాకడి
పోలీసులు చేతులెత్తేయడంతో బరితెగించిన పందేలరాయుళ్లకు రాజకీయ, సినీ ప్రముఖులు అండగా నిలిచారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులతో సహా పలువురు నేతలు పందేల శిబిరాలకు రిబ్బన్ కత్తిరించి పుంజుల్ని బరిలోకి వదిలారు. కోడిపందాల స్పెషలిస్ట్‌గా పేరొందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పెదవేగి మండలం అంకన్నగూడెంలో స్వయంగా పందాలను నిర్వహించారు. తండ్రితో సహా ఆయన శిబిరం వద్దే తిష్టవేసి, కత్తులతో కోళ్లు సాగించిన సమరానికి అండదండలందించారు. కామవరపుకోట మండలం కళ్లచెరువులో ఓ ప్రముఖ నేత సమీప బంధువు భారీ శిబిరాన్ని నిర్వహించారు. ఇక్కడ కోడిపందాలతో పాటు కోత ముక్కలాట జోరుగా సాగింది. ఒక్కరోజులోనే దాదాపు రూ. కోటి చేతులు మారాయి. పాలకొల్లు మండలం పూలపల్లిలో ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు పందాలను తిలకించారు. బుట్టాయగూడెం మండలం దుద్దుకూరులో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కోడి పందాల శిబిరాన్ని ప్రారంభించారు. యలమంచిలి మండలం కలగంపూడిలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు పందాలను తిలకించారు.

జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో టీవీ నటి మంజుల శిబిరాన్ని ప్రారంభించి సందడి చేశారు. అయిభీమవరం, వెంప, భీమవరం ఆశ్రమంలో జరిగిన పందాలను సినీ నటులు ఆహుతి ప్రసాద్, చిన్నా, నిర్మాతలు సి కల్యాణ్, కేఎస్ రామారావు, దిల్ రాజు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లతో పాటు పలువురు టీవీ యాంకర్లు సందర్శించారు. నిడదవోలులో జరిగిన శిబిరంలో సినీ నటుడు, మాజీ మంత్రి బాబూమోహన్, ఖమ్మం, తూర్పుగోదావరి జిల్లాల ఎమ్మెల్సీలు బలసాని లక్ష్మీనారాయణ, బొడ్డు భాస్కరరామారావు, మాజీ ఎమ్మెల్యే తోట గోవిందరాజులు తదితరులు కోళ్ల సమరానికి ప్రత్యక్ష సాక్షులుగా నిలిచారు.

తాడేపల్లిగూడెం రన్‌వే సమీపంలో ఓ రౌడీ షీటర్ కుటుంబ సభ్యులు నిర్వహించిన శిబిరంలో ఒంగోలు, నెల్లూరు, కడప ప్రాంతాలనుంచి వచ్చిన ఫ్యాక్షన్ నేతలు పాల్గొన్నారు. ఉంగుటూరులో జరిగిన పందాలను పదివేల మంది తిలకించగా, వారిలో దాదాపు వెయ్యి మంది కూ. కోటి మొత్తాన్ని పందెం కట్టారు. లింగపాలెం మండలం కొణిజర్లలో కాంగ్రెస్ నాయకుడు మోరంపూడి జగన్ ఆధ్వర్యంలో జరిగిన భారీ శిబిరానికి రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన వేలాది మందితో ఆ ప్రాంతం కిక్కిరిసింది. 300లకు పైగా కార్లు, వేల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు అక్కడికి రావడంతో రెండు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించి పోయింది. తాడేపల్లిగూడెంలోని ఓ థియేటర్ వద్ద పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వర్గీయులు శిబిరాన్ని నిర్వహిం చారు.

 
పందెంరాయుళ్లకు రాజభోగాలు
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖులతో పాటు రూ.లక్షల్లో పందాలు కాసే ప్రముఖ జూదరుల కోసం నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ఏర్పాటైన దాదాపు 300 శిబిరాలకు అనుబంధంగా పేకాట కోసులు కూడా మొదలయ్యాయి. కోత ముక్కాట, గుండాటలు జోరుగా సాగాయి. మద్యం, బిర్యానీ స్టాళ్లు అన్ని చోట్లా ఏర్పాటు చేశారు. నిడదవోలు శిబిరానికి హాజరయ్యే వారికోసం ప్రత్యేకంగా పాస్‌లను ముద్రించి అందజేశారు. పాస్‌ల్లేని వారి కోసం ఎల్‌సీడీ తెరల్ని ఏర్పా టు చేసి ప్రత్యక్ష ప్రసారాల ద్వారా పందాలను తిలకించే సదుపాయం కల్పించారు. తాళ్లపూడి మండలం పోచవరం, రావూరుపాడు, వేగేశ్వరపురం, తిరుగుడుమెట్ట, చాగల్లు మండలం మీనానగరం, చిక్కాల, మార్కొండపాడు, కొవ్వూరు మండ లం వాడపల్లి, సీతంపేట, పోలవ రం మండలం గూటాల, మామిడిగొంది, చేగొండపల్లి, దేవరపల్లి మండలం దేవరపల్లి, చిన్నాయిగూడెం, పల్లంట్ల, యర్నగూడెం, యాదవోలు, గౌరీపట్నం, దుద్దుకూరు, పెదపాడు మండలం అప్పనవీడు, అత్తిలి మండలం కొమ్మర, అత్తిలి, తేతలి, వేల్పూరు, గుండాట, ఇరగవరం మండలం తూర్పు విప్పర్రు, ఇల్లిందలపర్రు, అయినపర్రు, రేలంగి శివారు, అయితంపూడి, పోడూరు, ఆకివీడు, కాళ్ల, బుట్టాయగూడెం మండలం దుద్దుకూరు, వెలుతురువారిగూడెం, బూసరాజుపల్లి, కామవరపుకోట మండలం కళ్లచెరువు, వెంకటాపురం, రావికంపాడు, పాతూరు, కొయ్యలగూడెం మండలం కేంద్రం కొయ్యలగూడెం, బయ్యనగూడెం, రాజవరం, కన్నాపురం గ్రామాలతో సహా సీతంపేట, రామానుజపురం, దిప్పకాయలపాడు, టి.నరసాపురం మండలం తిరుమలదేవిపేట, రాజుపోతేపల్లి, టి.నరసాపురం, జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం, అంకంపాలెం, పి.రాజవరం, ములగలంపల్లి, టి.గంగన్నగూడెం, చంద్రమ్మ కాలనీ,గోపాలపురం మండలం హుకుంపేట, కొవ్వూరుపాడు, గుడ్డిగూడెం, వెంకటాయపాలెం, వాదాలకుంట, పెదవేగి మండలం కవ్వగుంట, కొండలరావు పాలెం తదితర ప్రాంతాల్లో భారీ పందాలు జరగ్గా, జిల్లాలోని సగానికి పైగా గ్రామాల్లో చిన్నాచితకా పందాలు నిర్వహించారు.

ఖాకీలు ఖుషీ ..
కోడిపందాలు పోలీసులకు కాసుల పంటపండించాయి. పెద్ద పందాలు జరిగిన ప్రాంతాల్లోని పోలీసులకు రూ. రెండు లక్షల వరకు గిట్టుబాటైంది. మిగిలిన చోట్ల కూడా రూ. 20 వేల నుంచి లక్ష చొప్పున ముడుపులు అందడంతో ఖాకీలు ఖుషీ అయ్యారు.
పందాలపై వెబ్‌సైట్

రాష్ట్ర వ్యాప్త ప్రసిద్ది చెందిన భీమవరం కోడిపందాలపై ఉత్సాహవంతులు ఓ వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. చలనచిత్రం.కామ్‌కు అనుసంధానంగా ఏర్పాటు చేసిన ఈ సైట్‌లో పందాలు తిలకించిన వారి అభిప్రాయాలు, అనుభూతులతో పాటు ఎంత మొత్తంలో పందాలు జరిగాయన్నది కూడా పొందుపర్చడం విశేషం.
 
* యథేచ్ఛగా కోడిపందాలు
* తొలిరోజే చేతులు మారిన రూ. ఐదుకోట్లు
* పల్లెల్లో ఎటు చూసినా పేకాటశిబిరాలే..
* ‘ఎందుకో’ మూగబోయిన పోలీసుల ఫోన్లు
 

అమలాపురం : ‘పందాలు జరగనిచ్చేది లేదు..ఉక్కుపాదంతో అణిచివేస్తాం. పందాలకు పాల్పడేవారిపై జంతుహింస నివారణా చట్టంకింద కేసులు నమోదు చేస్తాం. స్థలయజమానులపై కూడా కేసులు నమోదు చేస్తాం..’ పోలీసులు చేసిన ఈ హెచ్చరికలు తాటాకు చప్పుళ్లుగానే మిగిలిపోయాయి. రాజకీయం ముందు ఖాకీ తలొంచక తప్పలేదు. కోడి పందాలకు బరి కొడుతుంటే, కోళ్ల కాళ్లకు కత్తులు తళతళ మెరుస్తుంటే, పందాలరాయుళ్ల చేతుల్లో పచ్చనోట్లు ఫెళఫెళలాడుతుంటే ప్రేక్షకపాత్ర వహించక తప్పలేదు. గతంలో ఎన్నడూ లేనిరీతిలో సంక్రాంతి తొలిరోజే రూ. ఐదు కోట్లు పైగా చేతులు మారాయి. ఏజెన్సీ, మెట్ట, కోనసీమ అనే తేడా లేకుండా దాదాపు జిల్లావ్యాప్తంగా పందాలు జరిగే గ్రామాలన్నీ పందెపు రాయుళ్లతో కిటకిటలాడాయి.

అన్నట్టుగానే రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మలికిపురంలో దగ్గరుండి మరీ కోడిపందాలు ఆడించడం పరిస్థితికి అద్దం పట్టింది. ఏటా భోగి మధ్యాహ్నం లేదా సాయంత్రం నుంచి పందాలు ప్రారంభమవుతాయి. కానీ ఈ ఏడాది ఉదయం నుంచే పందాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు గుండాటలకు పలుచోట్ల అనుమతివ్వకపోవడంతో నిర్వాహకులు కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. పేకాటలకు మాత్రం ఎక్కడా పోలీసుల నుంచి ఎటువంటి ప్రతిఘటనలు ఎదురుకాకపోవడంతో ప్రతిచోటా పేకాటరాయుళ్ల హడావుడి కనిపించింది. మరొక పక్క లాడ్జిలు, హోటళ్లు కూడా జూదరులతో కిటకిటలాడాయి. కోనసీమ, మెట్ట, రంపచోడవరం ప్రాంతాల్లో పందాలు జోరుగా జరిగాయి.

స్థానిక రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గోడిలంకలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ యాళ్ల దొరబాబుతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు పందాల్లో పాల్గొన్నారు. కోనసీమలో తొలిరోజే రూ.రెండున్నర కోట్లు.. మెట్ట, ఏజెన్సీ, సబ్‌ప్లాన్ ఏజెన్సీప్రాంతాల్లో మరో రెండున్నరకోట్ల వరకు పందాలు జరిగినట్టు అంచనా వేస్తున్నారు. కాగా కోనసీమకు చెందిన మంత్రి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పందాలు జరగ్గా, మెట్టలోని మంత్రి నియోజకవర్గంలో తొలిరోజు పందాలు ఛాయలు పెద్దగా కనిపించలేదు. ఆది, సోమవారాల్లో మాత్రం జిల్లావ్యాప్తంగా గతంలో మాదిరిగా పెద్దఎత్తున పందాలకు నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సంక్రాంతి సందర్భంగా జిల్లాలో దాదాపు రూ. 25 కోట్లు పైగా పందాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. మరోపక్క జిల్లావ్యాప్తంగా నాటుసారా, కల్లువిక్రయాలు ఊహించని రీతిలో జోరందుకున్నాయి.

డీఎస్పీపై మంత్రి ఆగ్రహం..
ప్రజాప్రతినిధులెంత ఒత్తిడి చేసినా పలుచోట్ల పందాలపై దాడులు చేసి పెద్ద ఎత్తున పందెపుకోళ్లను స్వాధీనం పర్చుకుని, పందెపు రాయుళ్లను అరెస్టు చేసిన ఓ డివిజన్ స్థాయి పోలీస్ అధికారిపై ఒక మంత్రి నిప్పులు చెరిగినట్టు సమాచారం. ఏటా జరిగే సంప్రదాయ ఉత్సవాలను ఎలా అడ్డుకుంటారంటూ మండిపడినట్టు తెలిసింది. ఆ అధికారిని వీఆర్‌లో పంపేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు చెబుతున్నారు. మరోపక్క బిల్లులు చెల్లించలేదనే సాకుతో సరిగ్గా సమయం చూసుకొని పోలీసులు వినియోగించే ‘సెల్‌నెట్’ కంపెనీ ఇన్‌కం కాల్స్ ను సైతం కట్ చేయడంతో మూగబోయాయి. అయితే ఇది సాకు మాత్రమేనని, రాజకీయ ఒత్తిళ్లను తట్టుకోలేక ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే సెల్‌ఫోన్‌లు స్విచ్‌ఆఫ్ చేశారంటున్నారు.

‘కోసు’ ప్రైసు మరీ హాట్ గురూ!
ఏనుగు చచ్చినా, బతికినా వెయ్యి వరహాలే అన్న నానుడి ఉంది. ఇది పందెపు కోళ్లకూ వర్తిస్తుంది. పందెంలో పోరాడి, చివరికి నేలకొరిగిన పుంజుల మాంసం అంటే మాంసాహార ప్రియులకు ఎంతో మక్కువ. ఎంత మక్కువ అంటే అలాంటి కోడిని (దీన్నే ‘కోసు’ అంటారు) కిలో రూ. 1500 నుంచి రూ. 2 వేల వరకు వేలంలో పోటీ పడి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఒక్కోసారి పోటీలు పడి రూ. 5 వేలకు కొనుగోలు చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఈ గిరాకీకి ఓ కారణం ఉంది. పందెపు కోళ్లను బాదం పిస్తాలు, జీడిపప్పులు, కోడిగుడ్డుతెల్లసొన, ఉడికించినమాంసం, బి కాంప్లెక్స్ మాత్రలు వంటి బలవర్ధక ఆహారంతో పెంచుతుంటారు. అందుకే వాటి మాంసానికి ప్రత్యేకమైన రుచి ఉంటుంది. గతంలో ఎన్నడూ లేనిరీతిలో హైదరాబాద్ స్థాయిలో మంత్రులు, రాజకీయ ప్రముఖులతో పాటు అధికారులు, అనధికార ప్రముఖులు కోసు మాంసం కోసం వెంపర్లాడుతున్నారని, హైదరాబాద్‌కు వచ్చే వారిని కాస్త కోసుమాంసం తీసుకు రండంటూ పురమాయిస్తున్నారని తెలుస్తోంది. ఈ మాంసంతో చేసిన బిర్యాని, నాటుకోడి పులుసు తినేందుకు మాంసప్రియులు ఆసక్తి చూపుతారు.